41 వేల స్కూళ్లకు 59 లక్షల మంది విద్యార్థులు
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం కోలాహలం
మన ఊరు – మన బడితో కొత్త రూపుతో స్కూళ్లు
రెండేండ్ల తర్వాత గాడినపడ్డ అకడమిక్ క్యాలెండర్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల పొడిగింపు లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టత ఇవ్వటంతో రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. కరోనాతో గత రెండేండ్లుగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. 2020 సెప్టెంబర్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో 2021లో జూలైలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి, సెప్టెంబర్ 1 నుంచి ముఖాముఖి తరగతులు కొనసాగించారు. రెండేండ్ల విరామం తర్వాత అకడమిక్ క్యాలెండర్ గాడిన పడింది. ప్రతీ సంవత్సరంలాగే 2022 -23 విద్యా సంవత్సరం జూన్ రెండో వారంలో మొదలవుతున్నది.
టీచర్లకు అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ శిక్షణ
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1-8 తరగతులకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని మంత్రి సబిత తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని సూచించారు. బడిబాటలో భాగంగా 70, 698 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమం మరో వారంపాటు కొనసాగుతుందని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలు ఇబ్బంది పడకుండా నెలపాటు బ్రిడ్జి కోర్సు తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మన ఊరు – మన బడిలో భాగంగా 9 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, చైర్మన్లు విద్యార్థులను స్వాగతించాలని కోరారు. బడుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని, మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలని సూచించారు.
2022 -23 సంవత్సరానికి యాక్షన్ప్లాన్