కరీంనగర్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువ్తెతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను, వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 20 నుంచి 29 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నది. దీంతో తొమ్మిది రోజులపాటు పాఠశాలల్లో రాజకీయ వాతావారణం ఏర్పడటంతో రోజువారీ విద్యాబోధనకు తీవ్ర విఘాతం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
రెండు రోజుల్లో రెండు ఉత్తర్వులు
విద్యాహకు చట్టం-2009లోని సెక్షన్ 19, సబ్ సెక్షన్(1) ప్రకారం ప్రతి పాఠశాలలో (గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మినహా) స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు (ఎస్ఎంసీ) ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో 2019 తర్వాతా ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించలేదు. ఆయా కమిటీల కాలపరిమితిని ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఈ నెల 16న ఆదేశాలు జారీచేసింది. అందుకు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 18న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్పై విమర్శలొస్తున్నాయి.
షెడ్యూల్ ఇలా
సాధారణ పాఠశాలలు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాలు, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు ఈ నెల 20న ఒంటి గంటకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలి. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రుల జాబితా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. 22న తల్లిదండ్రుల జాబితాపై ఉదయం 9 నుంచి 4 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించాలి. 24న 11 గంటలకు తల్లిదండ్రుల తుది జాబితా విడుదల చేయాలి. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక నిర్వహించాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు సభ్యులతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తొలి విద్యా కమిటీ సమావేశం నిర్వహించాలి.
షెడ్యూల్పై విమర్శలు
పాఠశాల విద్యాకమిటీ జారీ చేసిన షెడ్యూల్పై విమర్శలొస్తున్నాయి. మార్చిలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ప్రస్తుతం ప్రీ ఫైనల్స్కు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పాఠశాలల్లో ఎన్నికల కోలాహలం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. 20న పీటీఎంతోపాటు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకేరోజు రెండు కార్యక్రమాలు చేపట్టాల్సి రావడం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఉపాధ్యాయులంతా 20 నుంచి ఎస్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెడితే… తొమ్మిది రోజులపాటు బోధనలు కుంటు పడే అవకాశం ఉన్నది. దీంతో వార్షిక పరీక్షల ముందు గందరగోళం ఏర్పడే పరిస్థితి రానున్నది.
ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి
ఇప్పటికే వివిధ కారణాలతో పాఠశాలల్లో తరగతులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం సముచితం కాదు. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదు. వెంటనే వీటిని వాయిదా వేయాలి. జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తదుపరి ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి.
– రాజిరెడ్డి, టీఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విద్యాసంవత్సరం చివరలో ఎన్నికలా?
ఎస్ఎంసీ ఎన్నికలను విద్యాసంవత్సరం చివరలో నిర్వహించడం వల్ల పాఠశాలల్లో బోధనలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే.. వచ్చే జూన్లోనే తిరిగి చాలా ప్రాంతాల్లో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే జూన్ లేదా జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.
– తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ కరీంనగర్ అధ్యక్షుడు
బోధనకు ఆటంకం
సంక్రాంతి సెలవులు ముగిసి ఇప్పుడే పాఠశాలలు గాడిన పడ్డాయి. ఈ సమయంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పెడితే.. వాతావారణం మొత్తం మారిపోతుంది. బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. ఎస్ఎంసీ ఎన్నికలకు ఇది సమయం కాదు. వీటిని వాయిదావేసి వచ్చే విద్యాసంత్సరం ఆరంభంలో నిర్వహించాలి.
– మహిపాల్రెడ్డి, రాష్ట్ర సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు