Telangana | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్-2023లో నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికే 5.88 శాతం దిగువకు తగ్గడం గమనార్హం. వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్.. 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను సోమవారం విడుదల చేసింది.
ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, సూలుకు వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నది. 2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4తోపాటు 2019-21లో నిర్వహించిన 5వ సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక సూచీలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.
మంత్రి కేటీఆర్ హర్షం
నీతి ఆయోగ్ నివేదికలో తెలంగాణ సాధించిన ప్రగతిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, తలసరి పేదరికం 13.18 నుంచి 5.88 శాతానికి దిగివచ్చిందని వివరించారు. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ను పోస్టు చేశారు.
రెండు సార్లు ప్రధాన మంత్రిగా, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పేదరికాన్ని నిర్మూలించడంలో ఘోరంగా విఫలమయ్యారని నీతి ఆయోగ్ నివేదికతో మరోసారి తేలింది. ఇదే సమయంలో తెలంగాణ వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలనలో తెలంగాణ-గుజరాత్ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు వెల్లడించింది.