మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 : మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టేనని పేర్కొన్నారు. నగరంలోని మోతీనగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ నిర్వహిస్తున్న నిత్యమాల కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేజిక్కించుకొంటున్నదని విమర్శించారు. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. బడా బాబులకు ధారాదత్తం చేయడానికి యత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొన్న ఆ పార్టీకి తగినవిధంగా బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక, కర్షకులు నిర్వహించే ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు జీ దశరథ్, బొట్టు శివ, రాజు, సీ కుర్మయ్య, ఎస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.