కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతే సింగరేణి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికలపై నిర్వహించిన సమావేశానికి ఏకంగా 13 సంఘాలు గైర్హాజరయ్యాయి. అయినప్పటికీ మొండిపట్టు వీడని కేంద్రం.. కార్మికుల అభిప్రాయాన్ని కాదని సింగరేణి ఎన్నికల తేదీని ప్రకటించడంపై యూనియన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు అన్ని సంఘాలు ఇప్పుడే ఎన్నికలు వద్దు అని మొత్తుకుంటున్నా.. కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణపై కార్మికశాఖ నిర్వహించిన సమావేశానికి 13 కార్మిక సంఘాలు గైర్హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తపరిచినా.. కార్మికశాఖ ఎన్నికల తేదీని ఖరారు చేసింది. గైర్హాజరైన వాటిలో మూడు జాతీయ కార్మిక సంఘాలతోపాటు టీబీజీకేఎస్ కూడా ఉన్నది. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. సింగరేణి పరిధిలో 15 కార్మిక సంఘాలుండగా.. 13 యూనియన్లు ఇప్పటికిప్పుడు గుర్తింపు ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతున్నాయి.
ఆ మేరకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్కు నేరుగా ఈ మెయిల్స్ కూడా పంపాయి. మెజార్టీ కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో సింగరేణి యాజమాన్యం కూడా అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాలని లేబర్ కమిషనర్కు తెలిపింది. అయినప్పటికీ కోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంపై సర్వత్రా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. సింగరేణిలో అనేక అంశాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందని, అవన్నీ సరిచేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కార్మికశాఖ మొండికేస్తే ఇటు కార్మిక సంఘాలు, అటు యాజమాన్యం కూడా మరోమారు కోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ఈ సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఆ ఏర్పాట్లలో నిమగ్నమవుతుంది. ఇక సింగరేణిలోని ప్రతి కార్మిక సంఘం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని, వాటిని వాయిదా వేయాలని ప్రధాన కార్మిక సంఘాలు కేంద్ర కార్మికశాఖకు విన్నవించాయి. ఈ విజ్ఞాపనలు వేటినీ అధికారులు పట్టించుకోలేదు.
సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్లో ఉంది. సింగరేణిలో దాదాపు రెండు దశాబ్దాల తరువాత ప్రతిష్ఠాత్మకంగా జాతీయ స్థాయిలో రెస్క్యూ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 20కిపైగా మైనింగ్ సంస్థల బృందాలు ఇక్కడికి వస్తున్నాయి. అతి కీలకకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా.. క్షేత్రస్థాయి పరిస్థితులను కనీసం అంచనా వేయకుండా, మెజార్టీ యూనియన్ నాయకుల అభిప్రాయాలకు విలువనీయకుండా.. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికారయంత్రాంగం, అటు కార్మిక సంఘాల సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల షెడ్యూల్ను ఉపసంహరించుకోవాలని, తమ అభిప్రాయాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో మార్పులు చేయాలని, ఎన్నికల నిర్వహణకు కాల వ్యవధి ఉండాలని కోరుతున్నాం. ఇలా అనేక మార్పులు, చేర్పులకు సంబంధించి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తూ బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యాం. అయినా కేంద్ర కార్మిక శాఖ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, షెడ్యూల్ను ప్రకటించడం సరైంది కాదు. సింగరేణి ఉన్న జిల్లాల అధికార యంత్రాంగం సహాయం లేకుండా.. ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? అది సాధ్యమయ్యేదేనా? మొన్న వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్పై యాజమాన్యం డివిజన్ బెంచ్కు వెళ్లాలని ఆలోచిస్తున్నది.
కోర్టు తీర్పు ప్రకారం అని చెప్తున్నప్పటికీ.. 13 సంఘాలు గైర్హాజరైనా నిర్ణయం ఎలా తీసుకుంటారు. గణేశ్ నిమజ్జనాలు ఉన్నాయి.. చాలా దూరం నుంచి రావడం కష్టమవుతుంది.. సమావేశం కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరినా పట్టించుకోకపోతే ఎలా? ఎన్నికలను వాయిదా వేయాలని ముందు నుంచీ చెప్తున్నాం. గతంలో ఎన్నడూ కలవని ఆ రెండు సంఘాలు ఏఐటీయూసీ, బీఎంఎస్లు హాజరైతే ఎన్నికల షెడ్యూల్ను ఎలా ప్రకటిస్తారు? డివిజన్ బెంచ్కు వెళ్లక తప్పదేమో! ఎన్నికలపై స్టే ఇచ్చేలా పిటిషన్ వేయాల్సి ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ అధికారులు ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వెనుక.. ఢిల్లీ ఒత్తిడి ఉందనే అనుమానాలున్నాయి.
హైదరాబాద్లోని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బుధవారం సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 28న ఉందయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 30న ఓటర్ల జాబితాను సింగరేణి యాజమాన్యం కార్మి క సంఘాలకు, రిటర్నింగ్ అధికారికి అం దించాలి. ఈ జాబితాపై అభ్యంతరాలను యూనియన్లు అక్టోబర్ 3లోగా తెలపాలి. అభ్యంతరాలపై అక్టోబర్ 4న రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 5న ప్రకటిస్తారు. అక్టోబర్ 6న నామినేషన్లను దాఖ లు చేయాలి. 7న నామినేషన్లకు ఆఖరు తేది. ఉపంహరణకు తుది గడువు అక్టోబర్ 9. నామినేషన్ల స్క్రూటినీ అక్టోబర్ 10న చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఎన్నికల గుర్తులను ప్రకటిస్తారు. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించి అదేరోజు.. సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు.