డైవర్షన్ టాక్టిక్స్లో ఆరితేరిన మోదీ ప్రభుత్వం మరోసారి అదే ఎత్తుగడను ప్రయోగించింది. ఈసారి విశాఖ ఉక్కు విషయంలో!
“రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లోనూ, విశాఖ సహా దానికి సంబంధించిన అన్ని అనుబంధ సంస్థల్లోనూ కేంద్ర ప్రభుత్వ వాటాను వందశాతం ఉపసంహరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించాం”.. ఇదీ రెండు నెలల క్రితం కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటన. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోదీ సర్కారు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. రెండు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లోని పాలకపక్షమూ, ప్రతిపక్షమూ కనీసం నోరు విప్పి మాట్లాడలేదు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదట గళమెత్తింది తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సింగరేణి సంస్థ ద్వారా విశాఖ ఉక్కును కొనే అవకాశం ఉందేమో పరిశీలించాలని కూడా ఆయన ఆదేశించారు. అసలు కుట్రను మంత్రి కేటీఆర్ బట్టబయలు చేశారు. బైలాడీలా ఇనుప ఖనిజం గనులను ‘దోస్తు అదానీ’కి అప్పగించబోతున్నట్టు బయటపెట్టారు.
అదానీ గుట్టు రట్టు కావడంతోనే కేంద్రం రంగంలోకి దిగింది. మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనేదీ లేదంటూ గురువారం ఉదయం ప్రకటించిన కేంద్రమంత్రి ఫగన్సింగ్.. ఆ నిర్ణయం తన పరిధిలోనిది కాదంటూ సాయంత్రానికే మాటమార్చారు. విశాఖపై కేంద్రం గందరగోళ పర్చేందుకు ప్రయత్నించడం.. బైలాడీలా- అదానీపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే!
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ప్రభుత్వరంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
– 13.02.2023 నాడు పార్లమెంట్లో ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే ప్రకటన.
విశాఖ స్టీల్ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ప్లాంట్లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతున్నది. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం.
– 13.04.2023 నాడు ఉదయం విశాఖలో రోజ్గార్ మేళాలో ఫగ్గన్సింగ్ కులస్తే
ఆర్ఐఎన్ఎల్ పరిధిలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనే నిర్ణయం నా పరిధిలో లేదు. అది కేంద్ర క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం.
– 13.04.2023 నాడు సాయంత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఫగన్సింగ్ కులస్తే
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పూటకో ప్రకటన చేయాలి.. ప్రజలను గందరగోళంలోకి నెట్టాలి.. అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించాలి.. విశాఖ స్టీల్ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వం పక్కాగా అమలుచేస్తున్న ప్లాన్ ఇది. రెండు నెలల్లో రెండు విరుద్ధ ప్రకటనలు.. అంతెందుకు ఒకేరోజు ఉదయం ఒక మాట.. సాయంత్రం అందుకు విరుద్ధమైన మాట.. ఈ ప్రకటనల వెనుక కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంది? ఎందుకోసం ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నది? వీటి ద్వారా ఏం దాయాలని ప్రయత్నిస్తున్నది? ఎవరిని కాపాడాలని చూస్తున్నది? ఎవరిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నది? మొత్తం ఎపిసోడ్ వెనుక బీజేపీ సర్కారు రాజకీయమేంది?
బైలాడీలా గుట్టు బయటపడకూడదనేనా?
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉన్నది. ఈ బయ్యారానికి బైలాడీలా కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బయ్యారానికి బైలాడీలా గనులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటినుంచో కోరుతున్నది. కానీ, ఈ రెండు రాష్ర్టాల డిమాండ్లను పక్కనబెట్టి బైలాడీలా గనులను అదానీ గ్రూప్నకు కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులను భవిష్యత్తులో సురక్షితంగా కాపాడాలంటే ఇటు బయ్యారాన్ని, అటు వైజాగ్ స్టీల్ను నామరూపాల్లేకుండా చేయాలన్నదే కేంద్రం పథకమని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల అసలు కుట్రను బట్టబయలు చేశారు. ఈ పథకంలో భాగంగానే బయ్యారంలో ప్లాంటు స్థాపన సాధ్యంకాదని ప్రకటించిన కేంద్రం, విశాఖ స్టీల్ ప్లాంటును నష్టాల పేరుతో ప్రైవేటుపరం చేయాలని కుట్ర చేస్తున్నదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కేటీఆర్ ప్రకటనతో బీజేపీ పెద్దల్లో కలవరం, కేంద్ర ప్రభుత్వంలో కలకలం రేగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్ఎస్కు పేరు రావడాన్ని జీర్ణించుకోలేక డ్రామా
విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటినుంచీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ సంస్థ కార్మికులు చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించటమే కాకుండా కార్మికుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలుపాల్సిందిగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిని ఆదేశించారు. అంతటితో ఆగకుండా విశాఖ స్టీల్ను కేంద్రం కచ్చితంగా ప్రైవేటీకరించాలనే భావిస్తే కొనుగోలు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. బిడ్డింగ్లో పాల్గొనే అంశాలను పరిశీలించాలని సింగరేణి అధికారులను ఆదేశించటంతో వారు విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించి వచ్చారు. వీఎస్పీ రక్షణకు బీఆర్ఎస్ ఇంత దూకుడుగా వెళ్తుండగా.. ఏపీలోని అధికార వైసీపీగానీ, ప్రతిపక్ష టీడీపీగానీ మొదటినుంచీ నోరు మెదుపటం లేదు. ఈ రెండు పార్టీలు బీజేపీ ప్రాపకంకోసమే విశాఖ స్టీల్ ప్లాంటు గురించి మాట్లాడటంలేదని కార్మికులతోపాటు ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఈ పరిణామాల మధ్య గురువారం ఉదయం కేంద్ర మంత్రి ఫగ్గన్సింగ్ ప్రకటన రెండు తెలుగు రాష్ర్టాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది.
బీఆర్ఎస్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కు తగ్గిందని కార్మికులతోపాటు సాధారణ ప్రజలు కూడా సోషల్మీడియాలో పుంఖాను పుంఖాలుగా పోస్టులు పెట్టారు. దీంతో ప్లాంటును రక్షించిన ఖ్యాతి మొత్తం బీఆర్ఎస్కే వెళ్తున్నదని ఏపీ పార్టీలతోపాటు బీజేపీ కూడా కలవరానికి గురయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ వస్తున్న ఖ్యాతిని అడ్డుకొనేందుకే కేంద్ర మంత్రి ఫగన్సింగ్ సాయంత్రం నాలుక మడతేసి మరో ప్రకటన చేశారనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రజలు, పార్టీలు, సంస్థలు, కార్మిక సంఘాలను గందరగోళానికి గురిచేసేందుకు ఫగ్గన్సింగ్తో బీజేపీ అధిష్ఠానమే ఉదయం ఒక రకమైన స్టేట్మెంట్ను ఇప్పించి.. సాయంత్రం అందుకు పూర్తి విరుద్ధమైన మరో స్టేట్మెంట్ను ఇప్పించినట్టు దని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీని వదిలి బీఆర్ఎస్పై ఏపీ పార్టీల గుస్సా
విశాఖ ఉక్కును కాపాడుకొనేందుకు సంస్థ కార్మికులు ఎంతోకాలంగా పోరాడుతున్నారు. ఏపీ ప్రజలు కూడా వారికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గురువారం చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు వారిలో తీవ్ర ఆగ్రహాన్ని, నిరాశను కలిగించాయి. కార్మికులు, ప్రజలు బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. విచిత్రంగా అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం బీజేపీని వదిలి బీఆర్ఎస్పై గుస్సా అవుతున్నాయి.
వైజాగ్ స్టీల్పై కేంద్రం అతి తెలివి
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్తోపాటు, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు.
కేంద్రం వెనక్కి తగ్గేదాకా పోరాడుతాం
– మంత్రి తన్నీరు హరీశ్ రావు
వికారాబాద్, ఏప్రిల్ 13, (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర సర్కారు పూర్తిగా వెనక్కి తగ్గేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వికారాబాద్లోని మర్పల్లి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును అడ్డికి పావుశేరుకు అమ్మేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
స్టీల్ ప్లాంట్పై చేతులెత్తేసిన టీడీపీ, వైసీపీ
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉకు కర్మాగారాన్ని 32 మంది బలిదానాల ఫలితంగా సాధించుకున్నామని, దానిని కేంద్రం ప్రైవేటుపరం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, వైసీపీ చోద్యం చూశాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ దుయ్యబట్టారు. విశాఖ ప్లాంట్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన ఐదు లక్షల మంది జీవితాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానికోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బైలాడీలా గనులను అదానీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
20 వేల ఎకరాల భూమిని విశాఖకే దక్కాలి
విశాఖ ఉకు కర్మాగారానికి సంబంధించిన 20 వేల ఎకరాల భూములు రాష్ట్రపతి పేరుమీద ఉన్నాయని, వాటిని తక్షణమే ఆర్ఐఎన్ఎల్ పేరుమీద బదలాయించాలని తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్ఎల్కు రూ.5 వేల కోట్లు అందజేయాలని కోరారు.