బీజేపీ పిటిషన్ ఎట్లా దాఖలు చేస్తుంది?
దాన్ని హైకోర్టు ఎలా స్వీకరించింది?
అసలు హైకోర్టులో ఏం జరుగుతున్నది?
సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది? దాన్ని హైకోర్టు ఎందుకు పరిశీలనకు స్వీకరించింది? ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు కాకుండా.. వేరేవాళ్లు హైకోర్టుకు వెళ్లడమేమిటి? నిందితుల తరఫున ఒక రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఎలా విచారణకు స్వీకరిస్తారు? అసలు హైకోర్టులో ఏం జరుగుతున్నది?
– సుప్రీం ధర్మాసనం
హైదరాబాద్ /న్యూఢిల్లీ, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్రశ్నించింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఎందుకు పరిగణించిందని అడిగింది. ఆరోపణలు ఎదురొంటున్నవాళ్లు కాకుండా వేరేవాళ్లు హైకోర్టుకు వెళ్లడమేమిటని సందేహాన్ని వెలిబుచ్చింది. ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులను రిమాండ్కు తరలించకపోవడాన్ని, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్ర భారతి అలియాస్ సతీశ్శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవా య్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హైకోర్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
బీజేపీ పిటిషన్ను హైకోర్టు పరిగణన లోకి తీసుకోవడం, నిందితులు కానివారు రిట్ దాఖలు చేయడాన్ని ఎత్తిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుంటూ.. నేరం చేశారని భావిస్తే పోలీసులు అరెస్టు చేయొచ్చునని అన్నారు. దర్యాప్తుపై స్టే విధించాలని ఒక రాజకీయ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని చెప్పారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ ఒక రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం, దానిని హైకోర్టు విచారణకు స్వీకరించడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అసలు హైకోర్టులో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ హైకోర్టు దర్యాప్తును వాయిదా వేయాలన్న ఉత్తర్వులను ఈ నెల 7 వరకు పొడిగించిందని చెప్పారు.
గంట పాటు సమయం వృథా
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ స్పందిస్తూ, హైకోర్టులో బీజేపీ పిటిషన్కు, తమకు సంబంధం లేదన్నారు. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య కేసులో ఇకడ పిటిషనర్ నలిగిపోతున్నారని చెప్పారు. బీజేపీ ఏం ఆశించి కేసు వేసిందో, ఏం పొందాలని అనుకుంటున్నదో కూడా తమకు తెలియదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఉద్దేశాలున్న పిటిషన్పై దాదాపు గంటపాటు సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేశారంటూ మందలించింది. వాద, ప్రతివాదాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే భావన కలుగుతున్నదని అభిప్రాయపడింది. అక్టోబర్ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఒక పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారని ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా చెప్పారు.
తీవ్ర అభియోగాల కేసుల్లో నిందితులకు విధిగా 41ఏ నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. సీఆర్పీసీలోని 41ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాకే అరెస్ట్ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిందని చెప్పారు. నిందితులకు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందని వాదనల అనంతరం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ కేసుపై విచారణ చేసి తగిన ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు/సుప్రీంకోర్టుల్లోని కేసులు అడ్డంకి కాబోవని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్న కేసు, ట్రయల్ కోర్టుపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఉత్తర్వుల్లో పేరొన్నది. కేసు విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.