హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉన్నదని పోలీసుల తరఫు న్యాయవాది కీర్తి కిరణ్ తెలిపారు. ఈ కేసులో ఏసీపీ సురేందర్ తరఫున వాదిస్తున్న ఆయన.. సిర్పూర్కర్ కమిషన్ కేవలం తన నివేదికను సమర్పించిందని, అంత మాత్రాన ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ నిజాలే అని కోర్టు నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అందుకే ఈ కమిషన్ నివేదికపై విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. నివేదికలోని అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అభియప్రాయపడ్డారు. ‘ఒకవేళ సిర్పూర్కర్ కమిషన్ నివేదికలోని అంశాలన్నీ నిజాలే అయితే నేరుగా సుప్రీంకోర్టే దీనిపై తీర్పు ఇచ్చేది కదా? మళ్లీ హైకోర్టుకు విచారణ కోసం ఎందుకు ఇస్తుంది? ఈ అంశాన్ని అందరూ గుర్తించాలి. వాస్తవానికి కమిషన్ నివేదిక అంతా తప్పుల తడకగా ఉన్నది’అని పేర్కొన్నారు. పోలీసులు చెప్పింది కట్టుకథలని, అది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పిన కమిషన్.. మరి అసలు వాస్తవాలేమిటో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కమిషన్ను వేసింది నిజ నిర్ధారణ కోసమని, కానీ నిజాలను నిర్ధారించే అంశాలేవీ నివేదికలో లేవని తెలిపారు.
మచ్చుకు కొన్ని అనుమానాలు
సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో అనేక అనుమానాలు ఉన్నాయని, మచ్చుకు కొన్నింటిని న్యాయవాది కీర్తికిరణ్ ఇలా వివరించారు. ‘ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్లలో ముగ్గురిని ఉద్దేశపూర్వకంగానే మైనర్లుగా చూపేందుకు కమిషన్ వారి స్కూల్ బోనాఫైడ్ సర్టిఫికెట్లలో ఉన్న పుట్టిన తేదీలను ప్రాతిపదికగా తీసుకొన్నది. ఆధార్ కార్డుల ప్రకారం వాళ్లు మేజర్లు. ఆ నలుగురిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొన్నప్పుడు వాళ్లు డాక్టర్లకు చెప్పిన ప్రకారం వాళ్ల వయసు మేజర్లుగానే నమోదైంది. వీటిని పక్కనపెట్టిన కమిషన్.. నిందితుల తల్లిదండ్రులు స్కూలు నుంచి తెచ్చిన, తెల్ల ఇంకుతో దిద్దిన బోనాఫైడ్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకొన్నది. కమిషన్ అభిప్రాయం ప్రకారం.. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పనికిరాదని భావించాలా?’ అని వివరించారు.
రెండో అంశం:
కమిషన్ను నియమించిందే నిజనిర్ధారణ చే యడానికి. పోలీసుల వర్షన్ తప్పయి తే వాస్తవాలేమిటో కమిషన్ నిర్ధారించాలి కదా? అని కీర్తి కిరణ్ ప్రశ్నించారు. ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు నిందితులకు నేర చరిత్ర లేదని, తుపాకీ పేల్చటం కూడా రా దని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ‘నిందితులకు తుపాకీ కా ల్చటం రాదు అని కమిషన్ పేర్కొన్నది. మరి నేరం చేసేవాడికి ముందుగా శిక్షణ ఇస్తారా? ఈ రోజుల్లో సినిమాల్లోనూ తుపాకుల వాడకంపై ఎన్నో సీన్లు ఉంటున్నాయి. నేర ప్రవృత్తి కలిగినవాడు కేవలం తుపాకీ తీసుకొని పారిపోతాడు అని చెప్పటం అనుమానాస్పదంగా ఉన్నది’ అని చెప్పారు.
పంచ్ విట్నెస్లు తిరిగి వచ్చిన సమయంతో ఏం పని?
నలుగురు నిందితులతోపాటు 10 మంది పోలీసులు, ఇద్దరు పంచ్ విట్నెస్లు బస్లో చటాన్పల్లి ప్రాంతానికి వెళ్లారని.. దిశ ఆర్టికల్స్ను దాచిఉంచిన చోటుకు వెళ్లే క్రమంలో కాల్పుల ఘటన జరిగిందని అన్నారు. ‘ఫైరింగ్ జరిగింది తెల్లవారుజామున 6 గంటలకు ముందు. ఆ సమయంలో అక్కడే ఉన్నామని వాళ్లు వాంగ్మూలం ఇచ్చారు. ఆ విషయాన్ని వదిలేసి కమిషన్ మాత్రం వాళ్లు అక్కడి నుంచి వెళ్లి, తిరిగి ఎప్పుడు వచ్చారన్న సమయాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. వాస్తవానికి ఇద్దరు పంచ్ విట్నెస్లు వాగ్మూలం ఇచ్చిన తర్వాత వారు అక్కడి నుంచి బయటికి వెళ్లి, తర్వాత ఎన్ని గంటలకు వస్తే ఏమిటి? ఎన్కౌంటర్ వాస్తవంగా జరిగిందా? లేదా? అన్నది నిర్ధారించాల్సింది పోయి పంచనామా ఎప్పుడు జరిగింది? ఎవరు ఎన్ని గంటలకు వెళ్లి, ఎప్పుడు తిరిగి వచ్చారన్న దానిపై కమిషన్ తన నివేదికలో అనుమానాలు వ్యక్తం చేసింది’ అని వెల్లడించారు.
సేఫ్ హౌజ్ ఉందో లేదో అని అనుమానించారు
నలుగురు నిందితులను సేఫ్ హౌజ్లో ఉంచారని చెప్పిన అంశాన్ని కమిషన్ తన నివేదికలో తప్పుగా పేర్కొన్నదని కీర్తికిరణ్ అన్నారు. ‘సేఫ్ హౌస్ (నిందితులను విచారించేందుకు ఉంచిన గెస్ట్ హౌస్) మేనేజర్, అందులో ఉన్న సెంట్రీని, సిబ్బందిని కమిషన్ విచారించింది. అందరి స్టేట్మెంట్లు నమోదు చేసుకొన్నాక కూడా సేఫ్ హౌజ్ ఉందో లేదో నమ్మశక్యంగా లేదని కమిషన్ పేర్కొన్నదంటే ఇంకేం చెప్తాం’ అన్నారు. ‘పోలీస్ మాన్యువల్ ప్రకారం ఫీల్డ్కి వెళ్లినప్పుడు గన్ లోడ్ చేసి, సేఫ్టీ ఆన్లో పెడతారట. విచారణ సందర్భంగా పోలీసులు స్వయంగా ఆయుధాన్ని తీసుకు వచ్చి కమిషన్ ముందు వివరించారు. కానీ గన్ పేల్చే విధానం చనిపోయిన నలుగురికి తెలిసి ఉండకపోవచ్చని, అందుకే వాళ్లు గన్ వాడి ఉండరేమో అని కమిషన్ అనుమానం లేవెనత్తింది. కానీ ఈ రోజుల్లో అన్ని సినిమాల్లో తుపాకుల వాడకాన్ని చూపిస్తూనే ఉన్నారు. పోలీసులకు ముందే ఎన్కౌంటర్ చేసే ఉద్దేశం ఉంటే.. నలుగురు నిందితులను షాద్నగర్ కోర్టులో హాజరుపర్చి, జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవటం, కోర్టు దగ్గర ప్రజల నుంచి నిందితులను కాపాడే క్రమంలో రాళ్ల దెబ్బలు తినటం ఇవన్నీ ఉండవు కదా!’అని కీర్తికిరణ్ పేర్కొన్నారు.