హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్దవే వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీబీఐ, ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సీబీఐ గానీ, తెలంగాణ పోలీసులు గానీ ఈ కేసులో విచారణ జరుపొద్దని ఆదేశించింది.