ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24/కోటపల్లి/పిట్లం: దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బాంధవుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. దళితుల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని 118 నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. దళితులంతా ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను మలు చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నారని సీఎం కేసీఆర్ను కీర్తిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సెవెళ్లి సంపత్, వెంకటేశ్, తెలంగాణ శంకర్, బోరెల్లి సురేశ్, దేవరకొండ నరేశ్, మీసాల మహేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రమంతటా క్షీరాభిషేకాలు దళితబంధు పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఎంపీపీ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయని పలువురు కృతజ్ఞతలు తెలిపారు.