హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్ సూర్యనాయక్ లాకప్డెత్పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డీజీపీ రవిగుప్తాకు వినతిప్రతమి చ్చారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సత్యవతి మీడియాతో మాట్లాడుతూ అన్నదమ్ముల పంచాయితీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సీనియర్ అధికారితో సమగ్ర విచారణ చేపట్టాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పదేండ్లు పాలించినా ఎక్కడా కవ్వింపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారితప్పుతున్నదని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకు పోలీసులు పావులుగా మారుతున్నారని పేర్కొన్నారు. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.