హైదరాబాద్ : తెలంగాణలో వరి పండిస్తున్న రైతులకు ఉరి వేస్తే.. బీజేపీకి కూడా ఉరి వేయడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. రైతుల మహోద్యమానికి తప్పకుండా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ప్రసంగించారు.
అన్నదాతల న్యాయమైన డిమాండ్ను ఢిల్లీకి వినిపించేందుకు సీఎం కేసీఆర్ ఈ ధర్నాకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రైతులను రక్షించుకునేందుకు పోరాటం చేయడం అంతే ముఖ్యం. పంటలను నమ్ముకుని బతుకుతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్రం తన బాధ్యతలను విస్మరించింది. రైతులను ఆదుకోవాలని, ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరిన స్పందన లేదు. కేంద్రానికి కనువిప్పు కలిగించేందుకు ఈ ధర్నా చేపట్టాం. రైతుల బతుకుల్లో విషాదం నింపేందుకు కేంద్రం యత్నిస్తోంది.
సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇస్తున్నాం. తెలంగాణ రైతుల కోసం పని చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. గతేడాది చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు తక్షణమే డబ్బులు అందించామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం సేకరించలేదు. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిడులు ఉన్నప్పటికీ ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల గురించి ఆలోచించుకోవాలి అని సండ్ర వెంకట వీరయ్య సూచించారు.