కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుబిడ్డగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు రాబంధు పాలన అని విమర్శించారు. రైతు కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. హనుమకొండలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు సంగ్రామ సభలో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం ఆగమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లలో వెయ్యి మంది రైతులు చనిపోయారని తెలిపారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని స్పష్టం చేశారు.
హనుమకొండలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు సంగ్రామ సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ వరంగల్ అని తెలిపారు. బీఆర్ఎస్ సభ పెడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతుందని అన్నారు. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెడితే అదే సమయానికి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారని తెలిపారు. కానీ రేవంత్ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. ఒక్క ఎకరానికి రైతు భరోసా వేసి అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులను పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతులకు కేసీఆర్ రూ.72వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. వరంగల్ జిల్లాలో చివరి భూముల వరకు కేసీఆర్ నీళ్లిచ్చారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని అన్నారు.