జనగామ : సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. ఆదివారం జనగామ(janagama )జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల లో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కొడకండ్ల నుంచి జలాల్ పూర్ క్రాస్ వరకు రూ. కోటి వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబం లో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న(Sarvai Papanna) అని పేర్కొన్నారు.
నిజాం పాలన పై తిరుగుబాటు చేసి, బానిస పాలన పై యుద్ధం ప్రకటించారని తెలిపారు. ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి అని అన్నారు . సీఎం కేసీఆర్(CM KCR) మనసున్న మహారాజు అని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలంలో గౌడ భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.
గౌడ కులస్థులకు వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. జనగామ జిల్లాకు ప్రముఖుడి పేరుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పాపన్న పేరు ఒక ప్రభుత్వ సంస్థకు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటానని వివరించారు. నాయకులు నాగపురి రాజలింగం, సినిహీరో జైహింద్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.