యాదాద్రి భువనగిరి : చేసిన పనులకు బిల్లులు(Pending bills) రాక ఎంతోమంది సర్పంచులు (Sarpanchs) ఆత్మహత్యలకు పాల్పడ్డారని చౌటుప్పల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్(Choutuppal) పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల సర్పంచులు సోమవారం ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచులనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకు ముందు 65వ జాతీయ రహదారిపై సర్పంచులు ర్యాలీ తీశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.