ములుగు : మేడారం (Medaram )మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా.ఎ.శరత్ (Sarath) అన్నారు. మంగళవారం ఆయన డైరెక్టర్ ఇ. వెంకట్ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి, మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
వన దేవతలను దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు ఇప్పటి నుంచే వస్తున్నందున అందుబాటులోకి తేవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుధ్యం తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, ఫ్లడ్ లైట్లు, తాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీపడవద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, జాతరను విజయవంతం చేయాలన్నారు.