మొయినాబాద్/హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): పిల్లలకు విద్యా, వికాసంతోపాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో శుక్రవారం గండిపేటలోని పల్లవి పబ్లిక్ సూల్లో ‘విత్తన బంతులు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్కుమార్.. విద్యార్థులతో స్వయంగా మట్టి, విత్తనాలను కలిపి విత్తన బంతులను తయారు చేయించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి ఆ విత్తన బంతులను విసిరేసి ఉత్సాహం నింపారు. ప్రయత్నం చిన్నదా? పెద్దదా? అన్నది కాదు.. చిన్న ప్రయత్నం జీవితంలో పెద్ద విజయాలను అందిస్తుందని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. అందుకు నిలువెత్తు నిదర్శనం గ్రీన్ ఇండియా చాలెంజ్ అని పేర్కొన్నారు. ఒక మొకలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్లవి స్కూల్ చైర్మన్ కొమురయ్య, డైరెక్టర్ యశస్వీ, టీవీ చానల్ ప్రతినిధులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.