Sandra Venkata Veeraiah | కాంగ్రెస్ కాలయాపనలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ తీరు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాలయాపనలో భాగమేనని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు.
మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సండ్ర మాట్లాడుతూ.. ఆ హామీలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గుర్తుచేయాల్సిన బాధ్యతను ప్రజలు తమపై పెట్టారన్నారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. ఎంతో అభివృద్ధి, సంక్షేమం చేసినా ఎందుకు ప్రజలు ఓట్లెయ్యలేదో లోతుగా అధ్యయనం చేశామని, లోపాలను సమీక్షించుకున్నామని తెలిపారు. గ్రామ, మండల స్థాయి కమిటీల్లో నిర్మాణాత్మకంగా చర్చించామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఐకమత్యంగా ముందుకెళతామని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమేనని, అవన్నీ తమకు తెలుసన్నారు. మరింత నమ్మకంతో, ఆత్మస్థెర్యంతో ముందుకెళతామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని తెలిపారు.