హైదరాబాద్, ఆగస్టు 3: హైదరాబాద్ కేంద్రంగా కమర్షియల్ ఈవీ వాహన తయారీ సంస్థ కెటో మోటర్స్..తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలోకి అడుగపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ బస్సు ‘అర్బనోవా కేఈ9’ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటో మోటర్స్ డైరెక్టర్ వెంకటేశ్ చల్లా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని ఈ మాడల్ను తయారు చేసినట్టు చెప్పారు. తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ బస్సులో 31 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుంటుందని, అలాగే సింగిల్ చార్జింగ్తో 150 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ బస్సు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నట్టు చెప్పారు. ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రీజనరేటివ్ బ్రేకింగ్, డిస్క్ బ్రేక్, భద్రతా ప్రమాణాలు, నూతన టెక్నాలజీతో తయారు చేసినట్టు తెలిపారు. మరోవైపు, జడ్చర్లలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వచ్చే మూడేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ యూనిట్తో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.