‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అనే భర్తృహరి పద్యాన్ని ఇసుకాసురులు కంఠతా పట్టినట్టున్నారు. ఈ ఫొటోలో కనపడుతున్న దృశ్యం చూడండి.. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో కాసింత దొడ్డు ఇసుక.. ఇంకేముందు ఇసుకైతే చాలు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దుగా ఉన్న గోదావరిలో అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారానికి మచ్చుతునక ఈ దృశ్యం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట సమీపంలో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది.
Sand Mafia | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ఇసుక మేటలు వేసిన ప్రాంతాల్లో మాత్రమే ఇసుక వ్యాపారం సాగుతుంటుంది. అక్రమంగా ఇసుక తరలింపు కూడా అక్కడే కొనసాగుతుంది. కానీ, ఇప్పుడు ఇసుకాసురులు కొత్త పుంతలు తొక్కారు. అసలు ఇసుకే కనపడని ప్రాంతాల్లోనూ రాళ్లను వడపోసి మరీ ఇసుకను తరలిస్తున్నారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నుంచి మొదలుకొని.. ధర్మపురి వరకు ఇసుక మేటలనేవి దాదాపుగా కనిపించవు. భారీగా రాళ్లు, రప్పలు, శిలలతో గోదావరి దర్శనమిస్తుంది. అక్కడక్కడా నల్లటి ఇసుక స్వల్పంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఇసుకకు డిమాండ్ ఉండేది కాదు. అయితే, ఇప్పుడు ఈ నల్లని దొడ్డు ఇసుకను కూడా అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుని కాసులు దండుకుంటున్నారు.
గోదావరికి అటూ.. ఇటూ..
నదిలో రాళ్లలా ఉన్న ఇసుకను సైతం అక్రమార్కులు దారులు వెతికిమరీ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధర్మపురి వరకు గోదావరి నది మొత్తం రాళ్లు, రప్పలతోనే కనపడుతుంది. అలా రాళ్లు, రప్పలుగా ఉండే గోదావరిలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కోమటి కొండాపూర్, వేములకుర్తి, మల్లాపూర్ మండలం మొగిలిపేట, వేంపెల్లి వెంకట్రావ్పేట, బోర్నపల్లి నుంచి మొదలుకుని..
ధర్మపురి పుణ్యక్షేత్రం వరకు ఇటు జగిత్యాల జిల్లా వైపు.. అటు నిర్మల్, మంచిర్యాల (పాత ఆదిలాబాద్) జిల్లాల వైపు నుంచి బాదనకుర్తి, ఖానాపూర్, చింతల్చాంద, చిట్యాల్, బెల్లాల్, భూత్కూర్ వద్ద కడెం-గోదావరి నదులు కలిసే చోట ఇసుక తరలింపు భారీగా సాగుతున్నది. ఏకంగా కడెం పాయను దాటడానికి మట్టి రోడ్డును వేసుకుని మరీ అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుండటం గమనార్హం.
ట్రాక్టర్ ఇసుక రూ.3 వేల వరకు..
ఇండ్ల పునాది, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి దొడ్డు ఇసుకను వాడుతుండటంతో అక్రమార్కుల దృష్టి రాళ్లు, రప్పలతో ఉండే గోదావరిపై పడింది. ఇంకేం కొత్త కొత్త దారులు కనుక్కుంటూ.. ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్ ఇసుక రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారు. దందాలో పోలీసు, రెవెన్యూ, పంచాయ తీ అధికారుల పాత్రకూడా ఉన్నట్టు సమాచారం.
స్థానికంగా ఉండే నేతలకు సహకరిస్తూ.. ఇసుక దందాను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇసుకాసురులకు అధికారుల సహకారం అనేది ‘మామూలే’ అని కూడా అంటున్నారు. ఈ వ్యవహారాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నది అధికార పక్షానికి చెందిన స్థానిక నేతలనే ఆరోపణలు వినపడుతున్నాయి. పైగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికార పార్టీలో చేరినట్టుగా ప్రకటించుకున్న ఇసుకాసురులు అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు.
స్థానిక వార్డు సభ్యులు, సర్పంచ్ (ప్రస్తుతం మాజీలు), ఎంపీటీసీలు సైతం పార్టీలు మారడం వెనుక ఈ ఇసుకాసురుల ‘హస్తం’ కూడా ఉన్నదని అంటున్నారు. తద్వారా అక్రమ ఇసుక తరలింపు వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రిప్పులుగా సాగుతున్నది. రాళ్లు రప్పల మధ్య ఉన్న ఇసుకను సైతం తమ వ్యాపారానికి అనుగుణంగా మలుచుకుంటూ.. గోదావరి నదిని లూటీ చేస్తున్నారు.
అక్రమ తరలింపు గూగుల్లో నిక్షిప్తం
నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దులోని గోదావరిలో సాగుతున్న ఇసుక అక్రమ వ్యాపారం తాలూకు సజీవ సాక్ష్యాలు గూగుల్లో నిక్షిప్తం అవుతున్నాయి. గూగుల్లో ‘నమస్తే తెలంగాణ’ పరిశీలించగా.. నదికి ఇరువైపులా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్టు కనపడుతున్నది. ఇసుక రవాణా కోసం గోదావరిలో ఏర్పాటు చేసుకున్న దారులుకూడా స్పష్టంగా కనపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వైపున కడెం-గోదావరి నదులు కలిసే చోట ఏర్పాటుచేసిన మట్టిరోడ్డు.. వాటిపై ట్రాక్టర్ల ఆనవాళ్లుకూడా గూగుల్ మ్యాపుల్లో స్పష్టంగా చూడొచ్చు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టుగా, అసలు ఇసుక అక్రమ రవాణాయే జరగనట్టుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.