హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాషలాడుతున్నారు. ఐడీ కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదంటున్నారు.
ఇక హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ ఇంట్లో సర్వేకి వెళ్లిన మహిళా ఎన్యూమరేటర్లపై కుక్కలను వదిలారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప, రమ్మశ్రీ.. అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదుచేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లారు. అయితే వారిని దుర్భాషలాడిన ఇంటి యజమాని, వారిపైకి కుక్కలను వదిలాడు. దీంతో భయాందోళనకు గురైనవారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.