హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): డీఏ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగవర్గంపై ప్రభుత్వం మరోమారు నీళ్లు కుమ్మరించింది. పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటైనా ఇస్తారని ఉద్యోగులు భావించినా, ఆ ఊసు లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగిసింది. డీఏపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొన్నది. రేపో, మాపో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో డీఏపై ఆశలు ఇక లేనట్టే. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మొత్తంగా నాలుగు డీఏలు బాకీపడింది. ఉద్యోగులతో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పెండింగ్ డీఏలపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్నీ ఒకేసారి అంటే కుదరదని, క్యాబినెట్లో చర్చించి ఒక్కొక్కటిగా మంజూరు చేస్తామని చెప్పారు. సీఎం చెప్పడంతో మంగళవారం నాటి క్యాబినెట్ భేటీలో రెండు డీఏలను మంజూరు చేస్తారని, కనీసం ఒకదానికైనా మోక్షం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. క్యాబినెట్ భేటీ మాత్రం డీఏ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తికి గురయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగులో ఉన్న మూడు డీఏలను మంజూరుచేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
మొత్తం బాకీ 5,400 కోట్లు
రాష్ట్రంలో మొత్తం 3,69,200 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ఈ జనవరితో కలుపుకొంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు డీఏలు బాకీపడింది. 2024 జనవరి డీఏను పీఆర్సీలో కలుపుకొని ఇస్తారని అనుకుంటే, దీనిని మినహాయిస్తే పెండింగ్లోని మూడు డీఏల మొత్తం రూ.5,400 కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు బాకీపడింది. వీటిలో డీఏ సహా గత ఎరియర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఒక డీఏ చెల్లించేందుకు రూ. 1800 కోట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా. ఇంత మొత్తం ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదన్న భావనతోనే కేబినెట్ డీఏల జోలికి వెళ్లలేదని సమాచారం. డీఏలకు బదులుగా రైతుభరోసా ఇచ్చేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
సోషల్ మీడియాలో కామెంట్లు
తీవ్రంగా నిరాశపరిచారు
డీఏలపై ఎలాంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గంలో చర్చించి ప్రకటిస్తామని ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోలేకపోయారు. డీఏలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరాలోచించాలి. లోక్సభ ఎన్నికలకు ముందు సానుకూల ఆదేశాలివ్వాలి.
– కే లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్