కురవి, ఏప్రిల్ 27 : కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రూనాయక్ పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న అంగన్వాడీలు ‘అయ్యో సార్ మాకు ఒకటో తేదీన జీతాలు రావడంలేదు’ అని ముక్తకంఠంతో ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. రామచంద్రూనాయక్ మాట్లాడు తూ.. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న అంగన్వాడీ కలుగజేసుకొని ‘సార్ మాకు మాత్రం జీతాలు రావడం లేదు’ అని ప్రసంగానికి అడ్డుతగిలారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టిలో జీతాలు పెంచాలనే అంశం ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పగా.. ‘సార్ మాకు పోయిన నెల జీతం రూ.13,650 ఇప్పటి వరకు రాలేదు’ అని అంగన్వాడీలు గుసగుసలాడారు.