హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): నాడు ఉద్యమ సమయంలోనైనా.. నేడైనా కాంగ్రెస్ ప్రభుత్వం సజ్జనార్ అనే పోలీస్ అధికారిని ముందుపెట్టి కేసీఆర్పై దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్యమ సమయంలో అలుగునూర్లో అరెస్టు చేసిన పోలీసులకు నాయకత్వం వహించింది.. మళ్లీ 17 ఏండ్ల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేపట్టిన సిట్కు నేతృత్వం వహిస్తున్నది సజ్జనారేనని గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమనేతగా కేసీఆర్ 2009, నవంబర్ 29న కరీంనగర్లోని తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటలోని రంగధాంపల్లిలోని ఆమరణ నిరాహార దీక్షా స్థలికి బయలుదేరారు. కొద్దిసేపటికే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ను అలుగునూర్ చౌరస్తాలో అరెస్టు చేశారు. ఆ అరెస్టుకు నాయకత్వం వహించిన ప్రత్యేక పోలీస్ (అక్టోపస్) బృందాన్ని లీడ్ చేసింది సజ్జనార్. ప్రస్తుతంఅదే సజ్జనార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారని, నాడూ నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం సజ్జనార్ను ముందుపెట్టి తమ అధినేత కేసీఆర్పై దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులు నిప్పులు చెరిగాయి.
మళ్లీ అదే వ్యూహం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు (నవంబర్ 29, 2009) ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరుతున్నప్పుడు ఉమ్మడి పాలకులు ఏ వ్యూహాన్ని అయితే అమలు చేశారో అదే వ్యూహాన్ని ఆదివారం కూడా అమలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని కేసీఆర్ను పోలీసులు కోరారు. హాజరవుతానని కేసీఆర్ బదులిచ్చారు. ఈ వ్యవహారం శనివారం సాయం త్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాకిపోయింది. ఆదివారం ఉదయం నుంచే తెలంగాణ నలుమూలల నుంచీ వేలాది మంది కార్యకర్తలు ఎర్రవెల్లికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు 2009 నాటి వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారని జరిగిన పరిణామాలు చెప్తున్నాయి. ఉదయం 11.25 గంటలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బయలుదేరగా, ఆ వెంటనే వందలాది వాహనాలు బయలుదేరాయి. రాజీవ్ రహదారిలోని గౌరారం, ములుగు, వంటిమామిడి, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్ ఇలా అనేక ప్రాంతాల నుంచి చీమలుబారులు తీరినట్టు భారీ కాన్వాయిగా మారింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రజలు రోడ్డు ఎక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ కాన్వాయ్ని అనుసరిస్తున్న వాహనాలను పథకం ప్రకారం నిరోధించారు. నాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్ వాహనాన్ని కరీంనగర్లోని ఎల్ఎండీ వంతెన దాటించి తక్కిన వాహనాలను నిలువరించినట్టే, ఎర్రవల్లి నుంచి వందలాదిగా వచ్చిన వాహనాలను టార్గె ట్ పెట్టి నిలువరించారు. బేగంపేటకు చేరుకునేసరికి కాన్వాయే లేకుండా పోవడం గమనార్హం.