హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సాయిచంద్ భార్య రజినికే ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సాయిచంద్ భార్య రజినిని చైర్పర్సన్గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివంగతులైన బీఆర్ఎస్ నేతలు సాయిచంద్, కుసుమ జగదీశ్ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇరువురి కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. వారి పిల్లలు, తల్లిదండ్రుల పేరిటరూ.25 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. సాయిచంద్ సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మొదటి నుంచి ఉద్యమంలో తమతోపాటు కలిసి పనిచేశారని గుర్తుచేశారు. 2001 నుంచి పార్టీ అధినేత కేసీఆర్కు అనుంగు సహచరుడిగా, యువజన విభాగం నాయకుడిగా పనిచేశారని చెప్పారు. చిన్న వయసులో కుసుమ జగదీశ్ మరణించడం బాధాకరమని, ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తమ్ముడు సాయిచంద్ చాలా చిన్న యవసులో అకాలమరణం చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరి అకాల మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని తెలిపారు. పార్టీకి దశాబ్దాలపాటు వారు చేసిన సేవలను గౌరవించి జగదీశ్ను జెడ్పీ చైర్మన్గా, సాయిచంద్ను గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించారని చెప్పారు.
కుటుంబసభ్యులుగా ఆదుకుంటాం
ఇప్పుడిప్పుడే సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ఉజ్వల రాజకీయ భవిష్యత్తును నిర్మించుకొంటున్న తరుణంలో వారు మరణించడం సీఎం కేసీఆర్ను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. వారిద్దరి కుటుంబాల స్థితిగతులను పరిశీలించిన తర్వాత పార్టీ అండగా ఉండాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇలా దాదాపు 150 మంది ఉన్నామని, అందరం ఒక నెల జీతాన్ని వారి కుటుంబాలకు అందివ్వాలని నిర్ణయించామని వివరించారు. రూ.3 కోట్ల వరకు వస్తాయని, ఇందులో కుసుమ జగదీశ్, సాయిచంద్ కుటుంబాలకు రూ.1.5 కోట్ల చొప్పున వెంటనే ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. జగదీశ్, సాయిచంద్ పిల్లల విద్య కోసం, భవిష్యత్తు అవసరాల కోసం వారి పేర్ల మీద రూ.25 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని, సాయిచంద్ తండ్రి, చెల్లెలికి రూ.25 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని, జగదీశ్ తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున అందిస్తామని వివరించారు.
ఆర్థిక సాయం మొత్తాన్ని పార్టీ నుంచే ఇవ్వొచ్చని, కానీ.. బీఆర్ఎస్లో అందరం ఒక కుటుంబమని, తోటి సభ్యులను ఆదుకుంటున్నామనే సందేశం ఇవ్వడానికే ఇలా చేశామని చెప్పా రు. ఈ బాధాతప్త సందర్భంలో ఆ కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, పార్టీ బాసటగా ఉంటుందని తెలిపారు. పార్టీకి వారు చేసిన సేవలను మరచిపోమని, లక్షల మంది కార్యకర్తలు సైతం అన్ని వేళలా అండగా ఉంటారని స్పష్టంచేశారు. లక్షల మంది పార్టీ కార్యకర్తల పోరాటాలు, శ్రమ, పట్టుదల వల్లే వందల మంది నాయకులు తయారయ్యారని గుర్తు చేశారు. సమావేశం లో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథో డ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, శంకర్నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు సతీశ్రెడ్డి, వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.