నందికొండ/శ్రీశైలం/అయిజ/అమరచింత/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 6: నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్ర, కర్ణాటకల్లో నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. దీంతో అధికారులు ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 1.45 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతుండటంతో సాగర్ కు ప్రవాహం పోటెత్తింది. దీంతో సాగర్ నీటిమట్టం శనివారం ఒక్కరోజే నాలుగు అడుగుల మేర పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడు గులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 569.50 అడుగులు (255.3105 టీఎంసీలు) ఉన్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు (215 టీఎంసీలు) ప్రస్తుతం 884.70 అడుగుల (213.8824 టీఎంసీలు)కు చేరింది.
నల్లగొండ జిల్లా కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు 13,531.09 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో 7 క్రస్ట్గేట్లను ఎత్తి 15,431.78 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్రకు 62,411 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 73,437 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 28 గేట్లు ఎత్తి అధికారులు నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 101.974 టీఎంసీల నిల్వ ఉన్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 78,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నది. దీంతో ప్రాజెక్టు 14 వరద గేట్ల నుంచి 74,952 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1088.60 అడుగుల (78.342 టీఎంసీలు) వద్ద ఉన్నదని వివరించారు.