Nagarjuna Sagar | నందికొండ, ఫిబ్రవరి 18: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే రానున్న రోజుల్లో దీని పరిధిలోని తెలంగాణ ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతాయని మాజీ ఇరిగేషన్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం నుంచే తెలంగాణకు అన్యాయం జరిగిందని గుర్తుచేస్తున్నారు.
పూర్తిగా తెలంగాణకు ఉపయోగపడే విధంగా నిర్మించాల్సిన నాగార్జునసాగర్ డ్యాంను 40 కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చి ఆంధ్రా ప్రాంతానికి ఎక్కువ లాభం చేకూరేలా నిర్మించారని వివరిస్తున్నారు. తెలంగాణకు నీళ్లు పారే ఎడమకాల్వను 510 అడుగుల కంటే ఎక్కువగా నీరు ఉంటేనే వాడుకొనేవిధంగా, ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే కుడికాల్వను 300 అడుగుల కంటే తక్కువగా నీరు ఉన్నా వాడుకొనే విధంగా ఏర్పాటుచేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేఆర్ఎంబీకి తప్పుడు లెక్కలు చూపుతూ తమ ప్రాంతానికి తరలించుకొనిపోయారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందని వివరిస్తున్నారు.
గత పదేండ్లలో కృష్ణానది నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాను కచ్చితంగా వాడుకుంటూ, ఎడమకాల్వ పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందించిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రానున్న రోజుల్లో తెలంగాణలోని సాగు భూములు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని, భూములన్నీ బీళ్లుగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నాగార్జునసాగర్పై ఆంధ్రా పెత్తనం
తెలంగాణ ఆధీనంలో ఉండాల్సిన నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణను అడ్డుకునేందుకు ఇటీవల ఆంధ్రా పాలకులు పోలీస్ బలగాల సాయంతో అర్ధరాత్రి డ్యాంపైకి చొరబడింది. ఇదే అదునుగా భావించిన కేంద్రం నాగార్జుసాగర్ను కేఆర్ఎంబీ ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డ్యాం కేంద్రం ఆధీనంలోకి వెళ్తే ఆంధ్రా పాలకులు గతంలో మాదిరిగానే నీటిని ఇష్టానుసారంగా తరలించుకుపోతారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో ఎడమకాల్వ ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డ్యాంపైకి వెళ్లే పరిస్థితి లేదు
నాగార్జునసాగర్ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి తెంలగాణ బలగాలను డ్యాంపైకి అనుమతించడం లేదు. విధుల్లోకి వెళ్లే తెలంగాణ ఉద్యోగులు కేవలం 13వ గేటు వరకే వెళ్తున్నారు. అది దాటి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతం మాచర్లలోని తమ కమాండెంట్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కుడికాల్వ గేట్లకు సంబంధించి విద్యుత్తు సరఫరా, ఆపరేటింగ్ అంతా తెలంగాణ నుంచే జరిగేది. సీఆర్పీఎఫ్ బలగాలు రాగానే ఆంధ్రా పాలకులు కుడికాల్వ నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే కేంద్రం ఆధీనంలోకి నాగార్జునసాగర్ డ్యాం వెళ్తే తెలంగాణకు నీటి కష్టాలు తప్పవు.