2050 నాటికి 90% నేల నిస్సారమే
1 శాతం కన్నా తకువైతే ఎడారీకరణే
మన నేలల్లో 0.65 శాతమే సేంద్రియం
మేల్కొనకపోతే ఎడారిలో బతకాల్సిందే
మట్టిలో జీవం అంటే రసాయనాలు కలపడం కాదు.. పోషక విలువలు పెరగాలి
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) పేరుతో ఆయన చేపట్టిన అంతర్జాతీయ యాత్ర బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనదేశంలో మట్టి సారం కోల్పోయి ఎడారీకరణ దిశగా సాగుతున్నదని అన్నారు. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలని, కానీ మన నేలల్లో ఇది 0.65 శాతం మాత్రమే చెప్పారు. నేల పైపొరలో (15 ఇంచుల లోతు వరకు) సారం పెరగకపోతే భవిష్యత్తు తరాలు ఎడారిలో బతకాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఇసుకలో పంటలు పండవని, తీవ్ర ఆహార కొరత తప్పదని చెప్పారు. 2045 నాటికి ప్రజలకు కావాల్సిన ఆహార ఉత్పత్తిలో 40 శాతం కొరత ఏర్పడుతుందని, ఏటా 30 లక్షల మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని సద్గురు ఆందోళన వ్యక్తంచేశారు. 2050 కల్లా 90 శాతం భూమి నిస్సారంగా మారిపోయే ప్రమాదముందని చెప్పారు. మట్టిని సారవంతం చేయడం అంటే రసాయనాలు కలపడం అనే భావన 85 శాతం మందిలో ఉన్నదని, అది నిజం కాదని తెలిపారు. మృత్తికకు సహజంగా సేంద్రియ పదార్థాలను చేర్చాలని సూచించారు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే ముందు.. మనం ఆచరించి చూపాలని కోరారు. మట్టిని కాపాడటానికి మొకలు నాటడం ఒకటే సరిపోదని చెప్పారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం..
గత 30 ఏండ్లుగా భూమిని కాపాడుకోవడంపై తాను ఉద్యమిస్తున్నానని, కానీ ఈ అంశంపై ప్రభుత్వాలు, ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. జనవరిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగినా… భూమిని కాపాడుకోవాల్సిన అవసరంపై చర్చించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్రాన్స్లో 2015లో మట్టిని కాపాడుకునేందుకు పాలసీలు చేసినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదని, భారత్ సహా అన్నిదేశాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొన్నదని చెప్పారు. మట్టిని కాపాడుకోవడానికి ప్రజలే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
సేవ్ సాయిల్పై 75 దేశాలు డిక్లరేషన్..
సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా ప్రతి దేశానికి అనుగుణంగా హ్యాండ్బుక్ సిద్ధం చేశామని జగ్గీ వాసుదేవ్ తెలిపారు. ఇప్పటివరకు 193 దేశాలకు అందించామని, ఇందులో 74 దేశాలు అంగీకరించి డిక్లరేషన్ ఇచ్చాయని వెల్లడించారు. చిన్న దేశాలకు సాయం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
సూచనలు..