రంగారెడ్డి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): 111 జీవో ఎత్తేయడంపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో ఈ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆమె బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో 111 జీవోను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని నిలదీశారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంతోనే అప్పట్లో 111 జీవోను తీసుకొచ్చారని, ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా అన్యాయంగా 111 జీవో పరిధిలోకి తీసుకువచ్చారని, కానీ 84 గ్రామాల ప్రజల కష్టాల తెలుసుకొని సీఎం ఆ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొన్నారని తెలిపా రు.
ఈ జీవో ఎత్తివేతపై ప్రశంసించడం మాని.. విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ జీవో ఎత్తివేస్తే హైదరాబాద్కు ఏదో జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్కు, 111 జీవోకు సంబంధం ఏంటని అన్నారు. హైదరాబాద్కు రాబోయే 50 ఏండ్ల వరకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నదని చెప్పారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా కాపాడుకొనే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, కాళేశ్వరం నుంచి నీటిని తరలించి జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నింపే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజల కోణంలో కాకుండా రాజకీయ కోణంలో చూస్తున్నారని అన్నారు. ఈ జీవోపై ప్రజల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉందా? అని మంత్రి నిలదీశారు.