బడంగ్పేట్, మార్చి11 : జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయడమే లేదన్న సీఎం రేవంత్రెడ్డిది విషప్రచారమేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. వారిపై ఆయనకు ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే పనుల్లోకి వెళ్తున్న వారిని సీఎం ఆడిపోసుకోవడం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామున పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులను ఆమె స్వయంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, వారిపై విషప్రచారం చేయడం సీఎంకు తగదని సూచించారు. డ్రైనేజీ మ్యాన్హోల్స్ ఓపెన్గా ఉంటే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సిబ్బందికి సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిపై పనిభారం పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4,500 స్వచ్ఛ ఆటోలు ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 స్వచ్ఛ ఆటోలు ఇచ్చిన్నట్టు సీఎం చెప్పారని, ఆ స్వచ్ఛ ఆటోలు ఎక్కడ ఉన్నాయని, గత ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ ఆటోలే కన్పిస్తున్నాయని చెప్పారు. అసలు పారిశుధ్య సిబ్బంది ఎక్కడ పనులు చేస్తున్నారో? తెలియదని ఒక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రోడ్లపై చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించడంతో ఎక్కడి చెత్తను అక్కడే తగుల పెడితే పైన ఉన్న విద్యుత్తు వైర్లు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చెత్త ఎత్తక పోవడానికి సరైన చెత్త వాహనాలు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. గతంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తమ బీఆర్ఎస్ ప్రభుత్వం చెత్త సమస్య లేకుండా చేసిందని గుర్తుచేశారు.
మీర్పేట్ చౌరస్తాలో పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి టీ తాగారు. నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని గంటలకు లేచి పనులు చేస్తారని ఎమ్మెల్యే అడగగా, రోజూ తెలవారుజామున 4 గంటల నుంచే పనులు మొదలుపెడుతామని కార్మికులు పేర్కొన్నారు. తమ కష్టానికి తగిన వేతనాలు అందడం లేదని ఆమెతో ఏకరువు పెట్టారు. తమలో చాలామందికి పీఎఫ్ అందడం లేదని తెలిపారు. ప్రస్తుతం బడంగ్పేట సర్కిల్లో ఎంతమంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు, ఇంకా ఎంతమంది కార్మికులు అవసరం ఉంటుంది, చెత్త ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఎన్ని ఉన్నాయంటూ డీసీ సరస్వతి, డీఈ అభినవ్, గంగప్రసాద్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరిని సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు.
కరోనా సమయంలో ఎవరూ బయటకు రాకున్నా పారిశుద్ధ్య సిబ్బంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనులు చేశారని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను అదే కార్మికులు స్వయంగా తీసుకెళ్లి దహనం చేశారని తెలిపారు. అలాంటి వారి గురించి ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కనీసం వారికి ఇవ్వాల్సిన నూనె, బెల్లం, మాస్క్లు సరైన సమయంలో ఇవ్వడమే లేదని మండిపడ్డారు. వారికి రావాల్సిన పీఎఫ్ సొమ్ము ఇవ్వకుండా.. వారిపైనే నిందలు వేయడమేమిటని నిలదీశారు. ప్రమాదంలో మరణించిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గ్రంథాలయ పనులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఏనుగుల అనిల్కుమార్యాదవ్, పల్లె జంగయ్యగౌడ్, అర్కల కామేశ్రెడ్డి, శ్రీనునాయక్, రాజ్కుమార్, మదారి రమేశ్, అంజయ్య, సునితా బాల్ రాజ్, నర్సిరెడ్డి, మాధవి, లలిత, గీత, మేకల యాదగిరి ఉన్నారు.