Rythubandhu | హైదరాబాద్ : రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. గతంలో మాదిరిగా రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ కానుంది.
అయితే ఎన్నికల సమయంలో రైతుబంధును కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రైతుబంధును ఆపాలని మొదట ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈసీని అనుమతి కోరగా, రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుంది. అలా రైతుబంధు నిధులు నవంబర్లో జమ కాకపోవడానికి కారణమైంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందించిన సంగతి తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే, ఎన్నికల కోడ్తో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలుపడంతో.. నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ట్రెజరీలో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని రైతుల నోట్లో మట్టి కొట్టింది. నాడు ట్రెజరీలో జమ చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.