నామినీ ఖాతాలో 5 లక్షలు జమ
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
మెదక్, ఫిబ్రవరి 17 : రైతుబీమా కోసం ధ్రువపత్రాలు అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఒక్క రోజులోనే డబ్బులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే రైతు బీమా మంజూరైందని, అదీగాక కేసీఆర్ సార్ బర్త్డే రోజే డబ్బులు రావడంతో సదరు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్పల్లికి చెందిన రైతు మంగళి దుర్గమ్మ గత నెల 26న మరణించింది. దుర్గమ్మ పేరిట రైతు బీమా పథకానికి ఆమె కొడుకు మంగళి నరేశ్ బుధవారం డాక్యుమెంట్లను గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభకు అందజేశారు. బుధవారం డాక్యుమెంట్లు అప్లోడ్ చేయగా గురువారం రైతు బీమా సొమ్ము రూ.5 లక్షలు నామినీ ఖాతాలో జమ అయ్యాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రైతు బీమా పరిహారం డబ్బులు తన ఖాతాలో జమ కావడంతో నామినీ మంగళి నరేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, మిగతా డబ్బును తన కూతురు పేరిట బ్యాంక్లో డిపాజిట్ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.