హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది. ఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని రైతు కుటుంబాల వినిమయ వ్యయం 12.9 శాతం పెరిగినట్టు తేలింది. ఈ స్థాయి పెరుగుదల ఇతర ఏ రాష్ట్ర రైతు కుటుంబాల్లోనూ కనిపించటంలేదని స్పష్టంచేసింది. ఐఐఎం అహ్మదాబాద్కు చెందిన పరిశోధక విద్యార్థులు అభిషేక్ షా, సావన్ రాఠి, అనింద్య ఎస్ చక్రవర్తి బృందం తెలంగాణ రైతుల్లో రైతుబంధు పథకం ప్రభావంపై అధ్యయనం చేసింది. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలన్నీ ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం గొప్పతనాన్ని ఐఐఎం అహ్మదాబాద్ కూడా ప్రశించించడం గమనార్హం. రైతుబంధు పథకం అమలు తర్వాత తెలంగాణ రైతు కుటుంబాల్లో ఆహారం, ఇంధనం, వైద్యం పై చేస్తున్న వ్యయం పెరిగిందని పరిశోధనలో తేలింది. ఈ స్థాయి పెరుగుదల దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కనిపించటంలేదని తేల్చిచెప్పింది.
రైతుకు ధైర్యం
ఇప్పటివరకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పది విడతల్లో రూ.65 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంపై తాజా అధ్యయనంలో పలు కీలక విషయాలను వెల్లడయ్యాయి. దేశంలో రైతుల కోసం ఇలాంటి పథకం అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పరిశోధకులు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 89 శాతం చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతున్నదని, రైతుబంధు పథకం కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచినట్టు ఐఐఎం బృందం వెల్లడిచిం ది. ఈ పథకాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుతో, ఇతర రాష్ర్టాలు కాళియా, క్రిషక్ బంధు, ఎన్వైఏవై పేర్లతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్టు తెలిపింది. ఈ పథకానికి 2018లోనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఏటా రూ.15 వేల కోట్లకు పథకం వ్యయం పెరిగింది. ఈ పథకం ద్వారా ఏటా 65 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నట్టు ఐఐఎం విద్యార్థులు గుర్తించారు. 2018లోనే ఈ పథకం ద్వారా ప్రతిరైతు సగటున రూ.9,974 పెట్టుబడి సాయం పొందినట్టు తమ నివేదికలో తెలిపారు. 2017లో ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి కూడా పరిశోధక బృందం కితాబిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 86 శాతం భూ వివాదాలను పరిష్కరించారని పేర్కొన్నది. రైతులకు పూర్తి వివరాలతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది.