నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 13: రైతుబంధు సాయాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్కు కర్షకలోకం జైకొడుతున్నది. రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతులు ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు చాటుతున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మరో 30 ఏండ్లయినా పూర్తి అయ్యేది కాదన్నారు. కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకపోయినా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు. ట్రాక్టర్లతో తరలివచ్చిన వేలాది మంది రైతులు భారీ ర్యాలీ తీయగా వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. స్థానిక దుర్గమ్మ ఆలయం నుంచి ఎస్వీ గార్డెన్ దాకా ఒగ్గుడోలు విన్యాసాలు, బోనాలతో ఊరేగింపు తీయగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వారితో కలిసి నృత్యం చేసి అలరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్బీఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకలు కాల్చి ‘జై సీఎం కేసీఆర్, జై రైతుబంధు’ అంటూ నినదించారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. ముందుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భీమారం, జైపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల మీదుగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని అమ్మగార్డెన్ వరకు సాగింది. జోరు వానలోనూ బాల్క సుమన్ స్వయంగా 45 కిలో మీటర్లు ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని బాల్క సుమన్ కొనియాడారు.
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఉద్యోగులు రైతుబంధుకు సంబంధించి ముగ్గులు వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేలా, రైతులకు అవగాహన కల్పించేలా చిరుధాన్యాలు, నూనె గింజల విత్తనాలతో ముగ్గులు వేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన టీఆర్ఎస్వై నేత సిలువేరి చిరంజీవి దంపతులు రైతుబంధు సంబురాలను వినూత్నంగా జరుపుకొన్నారు. సంక్రాంతి సందర్భంగా పిండి వంటలతో ‘జై కేసీఆర్.. రైతుబంధు’ అంటూ సకినాలు తయారు చేశారు.