హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. రైతుల ఖాతాల్లో రూ.50వేలకోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ఆదివారం కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్ చైర్మన్లతో జరిగిన టెలీకాన్ఫరెన్స్లో కేటీఆర్ రైతుబంధు సంబురాలుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చరిత్రలో ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అన్నారు. పథకం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయన్నారు.
రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతాంగం ఎనలేని సంతోషంతో ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఓ గొప్ప ఊతరంగా మారిందన్నారు. ఇలా రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి చేరిన సందర్భంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, ఇది అద్భుతమైన సందర్భం అన్నారు. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని అంతా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం, పీఎం చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం రైతన్నల కోసం కేసీఆర్ చేశారన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులయిన చెరువుల బలోపేతం వరకు.. రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు ఎవరూ కనీవినీ ఎరుగని గొప్ప కార్యక్రమాలను అమలు చేశారన్నారు. ఇలాంటి నేపథ్యంలో రైతుబంధు కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరనున్న సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. తాజాగా ప్రభుత్వం కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తించుకొని సంబురాలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు.