1.35 కోట్ల ఎకరాలకు రూ.6765 కోట్లు పంపిణీ
8వ రోజు 173 కోట్లు జమ
తెలంగాణలో రైతు రాజ్యం
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామని అన్నారు. ఇప్పటి వరకు కోటి 35 లక్షల ఎకరాలకు గాను మొత్తం రూ. 6764.94 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం 63,239 మంది రైతులకు రూ. 173.38 కోట్లు పంపిణీ జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
అప్పులు తెచ్చే బాధ తప్పింది
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. గతంలో పంట పెట్టుబడి కోసం తిరగని ఇల్లు లేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డం. అడ్తిదుకాణం, శావుకార్ల దగ్గర అప్పులు తెచ్చి పంట పండిన తరువాత అప్పుకు మిత్తి కట్టేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. రైతుల బాధల్ని గమనించి సీఎం సార్ రైతుల కోసం రైతుబంధు తెచ్చిండు. నాకు మా గ్రామం శివారుల 4 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. ఏటా రైతుబంధు సాయం కింద రూ. 21,500 వస్తున్నయ్. ఇప్పటి వరకు 8 సార్లు రైతుబంధు తీసుకున్న. వచ్చిన పైసలతో కొంత భూమి చదును చేసుకొన్న. వానకాలం పైప్లైన్ పనులు చేసుకున్న. ఇత్తునం వడ్లు కొన్న. మిగతా పైసల్ ట్రాక్టర్ కిరాయి, కూలీల పెట్టుబడికి అక్కరకు వస్తున్నయ్. రైతుల కోసం రైతుబంధు, బీమా పథకాలు తెచ్చిన సీఎం సారును రైతులు ఎప్పటికీ మరిచిపోరు.
– కొప్పుల సత్యనారాయణ, కిష్టంపేట గ్రామం, కాల్వశ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా