హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతులకు అందనున్నది. ఆ రోజు ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ కానున్నాయి. ఈ సీజన్లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. రైతుబంధుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్బందీ చర్యలు తీసుకొన్నారు. గత వానకాలం సీజన్లోనే రూ.50 వేల కోట్ల మార్క్ను దాటిన రైతుబంధు సాయం.. ఈ సీజన్తో రూ.65 వేల కోట్లకు చేరుతుండటం గమనార్హం.