హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): పదో విడత రైతుబంధు సంబురం మొదలైంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు నిధులను బుధవారం ఉదయం నుంచే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. తొలిరోజు ఎకరంలోపు రైతులకు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అర్హులైన చివరి రైతు వరకు రైతుబంధు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఈ సీజన్లో 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.7,676.61 కోట్లు సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ సీజన్లో 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు. గత తొమ్మిది విడతల్లో కలిపి మొత్తం రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశామని, ప్రస్తుతం పంపిణీ చేయనున్న పదో విడతతో కలిపితే ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరుతుందని చెప్పారు.
స్పష్టమైన సాగు విధానం లేని కేంద్రం
ఎనిమిదేండ్లలో ఇంత భారీ మొత్తంలో రైతులకు నేరుగా పెట్టుబడి సాయం పంపిణీ చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థితిలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు ఠంచనుగా రైతుబంధు అందజేస్తున్నారని కొనియాడారు. రైతు కేంద్రంగా పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అందుకే దేశ రైతాంగం తెలంగాణ పథకాలను అమలు చేయాలని నినదిస్తున్నదని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు పొందడం రైతుల హక్కు అని, కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదని అన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెకిన ప్రధాని నరేంద్ర మోదీ.. స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారని విమర్శించారు. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏండ్లు నిండిన రైతులకు పింఛన్, పంటలకు మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలను తుంగలో తొక్కి దేశ రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారని మండిపడ్డారు.
పదో విడత రైతుబంధు పంపిణీ ఇలా..
లబ్ధిపొందనున్న రైతులు 70.54 లక్షల మంది
మొత్తం విస్తీర్ణం 1.53 కోట్ల ఎకరాలు
పంపిణీ చేయనున్న మొత్తం రూ.7,676.61 కోట్లు
9 విడతల్లో పంపిణీ చేసిన మొత్తం రూ.57,882 కోట్లు
ఈ సీజన్తో కలిపితే మొత్తం రూ.65,559.28 కోట్లు