హైదరాబాద్ : రైతుబంధు పంట పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు, రంగవల్లులతో మహిళలు సంబరాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలను సంక్రాంతి పండుగ వరకు జరుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుబంధు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులందరూ కొవిడ్ నిబంధనలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10వ తేదీ వరకు రూ. 50,600 కోట్ల మైలురాయి దాటుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. పల్లెపల్లెనా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పంట దిగుబడులతో అభిషేకం చేస్తున్నారు.