హైదరాబాద్ : రైతుబంధు 8వ విడుత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తొలి రోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.5,44,55,71,967 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడుతలో ఎకరాలోపు భూమి ఉన్నవారికి, బుధవారం రెండెకరాలు, గురువారం మూడెకరాలు.. ఇలా రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. యాసంగి సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు రైతులకు పంపిణీ చేయనున్నది.
ఈ సందర్భంగా రైతులకు నిరాటంకంగా రైతుబంధు సాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఏడు విడుతల్లో రూ.43,036.63 కోట్ల ఇవ్వగా, ఎనిమిదవ విడతగా ఈ యాసంగి పంట కాలానికి రూ.7,645 కోట్లు విడుదల చేశారన్నారు.
ఇప్పటివరకు రూ.50వేలకోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. గత రెండేళ్లుగా కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ప్రపంచమంతా కుదేలైనా రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు.