హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. పోలింగ్కు 2 వారాల వ్యవధి ఉండటంతో ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని నియోజకవర్గాల్లో భారీ జనసమీకరణతో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీని కోసం రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో అభ్యర్థులకు తడిసి మోపెడవుతున్నది. ఇప్పటికే హుజూర్నగర్, మునుగోడు, హుజూరాబాద్, నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో మద్యం ఏరులై పారింది. డబ్బులు ఇవ్వలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేసిన ఉదంతాలున్నాయి. కానీ, ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసం కావడంతో అభ్యర్థులకు కాస్త కలిసొచ్చింది. కార్తీక మాసంలో హిందువులు నిష్ఠగా పూజలు చేస్తారు. చాలా మంది మద్యం, మాంసం ముట్టుకోరు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ వెంట ఉన్నవారికి మద్యం, బిర్యానీలు అందివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం వల్ల ఈ ఖర్చులో కొంత తగ్గడంతో అభ్యర్థులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.