హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చింది. పేరు మార్పుతో పాటు పథకం మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. రూసా-1ను 2013లో, రూసా-2ను 2018లో కేంద్రం ప్రకటించగా, తాజాగా 2023లో రూసా-3ని ప్రకటించాలి. కానీ, దానికి ముగింపు పలికి పీఎం-ఉషాగా మార్చింది. రూసా-1, రూసా-2లో భాగంగా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, వర్సిటీల అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
ఈ ప్రతిపాదనలకు కేంద్రం కొంత మేర మాత్రమే సాయం అందించింది. కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన దాంట్లో అరకొరగానే నిధులు మంజూరు చేసింది. రూసా-1లో రూ.176 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది. ఈ నిధులతో 2 వర్సిటీలు, 33 కాలేజీలకు మౌలిక వసతుల గ్రాంట్, నాలుగింటిని మాడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి, మరో మూడు డిగ్రీ కాలేజీలను మాడల్ డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాల్సి ఉన్నది. దీంట్లో కేంద్రం రూ.105 కోట్లకు రూ.89.3 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూసా-2లో రూ.251 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం లభించింది. దీంట్లో కేంద్రం వాటా రూ.150 కోట్లుంటే రూ.24.7 కోట్లు మాత్రమే విడుదల చేసింది.