హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాలర్తో రూపాయి మారకం విలువ అతి తక్కువకు పడిపోయిందని, అయితే దీనిని జుమ్లాలు ఆల్ టైం హైగా అభివర్ణిస్తారని కేటీఆర్ విమర్శించారు. ఓవైపు రూపాయి విలువ పడిపోతుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ దుకాణాల్లో మోదీ బొమ్మను వెతికే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
రూపాయి విలువ సహజంగా పెరుగుతుందని నిర్మలా సీతారామన్ చెబుతారని, దేశంలో ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడే) కారణమని అంటారేమోనని కేటీఆర్ పేర్కొన్నారు. విశ్వగురువుకు నమస్కారం అంటూ మోదీ గురించి వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్లు రూపాయిని ఎలా ప్రభావితం చేస్తున్నాయనే దానిపై జ్ఞానాన్ని అందిస్తున్న భక్తులారా.. విశ్వగురు మీ లాజిక్ అంగీకరించరు’ అని పేర్కొన్నారు. దీనిని విశ్వగురు ముత్యాల్లాంటి పదాల నుంచి ఏరి వెల్లడిస్తున్నానని తెలిపారు.
రైతులందరికి బీమా…
రైతులందరికీ బీమా వర్తింప చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనని, దీనికి గర్విస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో చనిపోయిన 85 వేల మంది రైతులకు రైతు బీమా ద్వారా రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. ఈ సంవత్సరానికి గాను 34 లక్షల మంది రైతులకు బీమా వర్తించే విధంగా రూ.1450 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
పల్లె ప్రగతితోనే
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలవడం పట్ల గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిల్వడం గర్వకారణమని ఆయన ట్విట్టర్లో తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన మానస పుత్రిక పల్లెప్రగతి కార్యక్రమం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయవచ్చు కానీ తెలంగాణ ప్రభుత్వ పనితీరు నిరంతరాయంగా ప్రశంసలను, హృదయాలను గెలుచుకుంటుందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ అధికారులు, బృందానికి అభినందనలు తెలిపారు. వీరితో పాటుగా 12,769 మంది సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులను కూడా ఆయన అభినందించారు.