Subsidy Cylinder | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): లబ్ధిదారు గ్యాస్ ఏజెన్సీకి కేవలం రూ.500 చెల్లిస్తే ఆయా ఏజెన్సీలు వారికి సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని, ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రజాపాలన దరఖాస్తులపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయా పథకాల అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సూచించారు.
వీటిని ఈ నెల 27 లేదా 29 తేదీల్లో అమలుచేయాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేదా ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాలు, ఆర్థికశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Gas
రేషన్కార్డు ఉంటే గృహలక్ష్మి అమలు
ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలుచేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్కార్డు ఉండి 200 యూ నిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులందరికీ గృహజ్యోతి కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల్లో కార్డు నెం బర్లు, కనెక్షన్ల నెంబర్లలో తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశమివ్వాలని ఆ దేశించారు. అన్ని విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెం టర్లు, సర్వీస్ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తుశాఖ ప్రచారం చేయాలని కోరారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని వర్తింపజేయాలని, అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టంచేశారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.