హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సంస్థ సిబ్బంది కోసం ఆర్టీసీ తార్నాక దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నదని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థలో సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి సహాయ, సహకారాలైన అందిస్తామని స్పష్టంచేశారు. ఆర్టీసీ తార్నాక దవాఖాన నుంచి మెరుగైన వైద్యం కోసం నిమ్స్లో చేరిన సంస్థ సిబ్బందిని, వారి కుటుంబసభ్యులను శనివారం ఆయన ప్రత్యేకంగా కలుసుకొన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు.
యాదగరిగుట్ట ఆర్టీసీ సీఐ కుమార్తె పూర్ణిమకు రెండు రోజుల్లో సర్జరీ అవుతున్నట్టు తెలుసుకొని ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రతిరోజు వైద్య సేవల కోసం ఎంత మంది ఆర్టీసీ సిబ్బంది చేరుతున్నారు? ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారనే వివరాలను పరిశీలించారు. మెరుగైన వైద్య సేవల కోసం నిమ్స్లో చేరిన వారికి సంస్థ తరఫునే మందులు సరఫరా చేస్తున్నామని చెప్పారు. వైద్యం విషయంలో ఏం కావాలన్నా చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందిస్తున్న నిమ్స్ వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.