Kamareddy | కామారెడ్డిల్లో ఘోర ప్రమాదం తప్పింది. టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పలువురు స్వల్పంగా గాయపడగా.. మిగిలినవారంతా సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొంకూరి నర్సయ్యగా గుర్తించారు. కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు.