RS Praveen Kumar | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజాపాలన కాస్తా ప్రజాపీడనగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు మళ్లీ రోడ్ల మీదికి వచ్చారని, ప్రభుత్వ పనితీరు ఈవెంట్ మేనేజ్మెంట్లా నడుస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ సూడో సెక్యులర్ పార్టీ అని, దేశానికి ఆ పార్టీ వల్ల నష్టం తప్ప లాభం జరగలేదని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నదని చెప్పారు. తెలంగాణను బీజేపీ, కాంగ్రెస్ నుంచి రక్షించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్- బీఎస్పీ పొత్తు తెలంగాణ బహుజనుల ఆకాంక్ష అని తేల్చిచెప్పారు. ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతున్నదని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్త ఖరారైన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ నుంచి రక్షించాలి. రాష్ట్రంలో కోట్ల మంది బహుజనుల ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగం రద్దు అయ్యే ప్రమాదం ఉన్నది. విచ్ఛిన్నకరమైన పరిస్థితి ఉన్నది. బహుజనులకు న్యాయం జరగాలనేది మా లక్ష్యం. ఎన్డీయేలో గానీ, ఇండియా కూటమిలో గానీ బీఎస్పీ లేదు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మాయావతి సూచించారు. అందుకు అనుగుణంగానే పొత్తులు పెట్టుకుంటున్నాం. గతంలో మేం వ్యక్తుల మీద, వారి అలవాట్ల మీద, వ్యక్తిగత విషయాలపై పోరాడలేదు. ప్రజల అస్థిత్వాన్ని నాశనం చేసే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తును ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, రాష్ట్ర ఏర్పాటుకు కారకులైన బీఆర్ఎస్, కేసీఆర్తో బీఎస్పీ కలవాలి, కలిస్తే తెలంగాణలో ప్రజలకు న్యాయం చేకురుతుందనే ఆలోచన ప్రజల నుంచి వచ్చింది. ఈ పొత్తు నేను ఎంపీ కావడానికి కాదు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది, మా పార్టీ నుంచి ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై క్లారిటీ రాలేదు. సీట్ల సర్దుబాటులో చర్చిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రజాపాలన కాస్తా ప్రజాపీడనగా మారింది. ప్రజలకు ఏదీ గ్యారెంటీ లేదు. కొత్త ప్రభుత్వ పనితీరు చారాణా చికెన్కు బారాణా మసాలా వేసినట్టు ఉన్నది. ఈవెంట్ మేనేజ్మెంట్లా నడుస్తున్నది. ఎల్బీ స్టేడియంలో మీటింగుల కోసం అధికార యంత్రాంగాన్ని నడిపే పరిస్థితి. సోషల్ మీడియాలో థంబ్నెయిల్ పెట్టి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ప్రజలకు ఏమీ జరగటం లేదు. ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు. మొదటి రోజు సీఎం వచ్చారు. దరఖాస్తు తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రులు పోయారు. ఆ తర్వాత అధికారులూ పోయారు. ఇప్పుడేమో ఎవరికో అప్పగించారు. ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు పెట్టినా, సమస్యలు పరిష్కారం కావటం లేదు. సీఎం రేవంత్రెడ్డి సమస్య విన్నానంటున్నారు తప్ప.. ఆ సమస్యను పరిష్కరించానని చెప్పటం లేదు. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలు. యాసంగి కోసం నీళ్లు లేవు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు న్యాయం జరగటం లేదు.
సెక్యులర్ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ హయాంలోనే అనేక మత ఘర్షణలు జరిగాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. పాతబస్తీలో అల్లర్లు జరిగాయి. జన్వాడలో చర్చిపై దాడులు జరిగితే సీఎం రేవంత్రెడ్డి స్పందించలేదు. వినాయక మంటపం ధ్వంసం చేస్తే స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ లౌకికతత్వాన్ని మోసం చేస్తున్నది. విచ్ఛిన్నకర అజెండాను ఇక్కడా అమలు చేయాలని బీజేపీ చూస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తున్నారు కానీ అమలు చేయటం లేదు. అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వటం లేదు. గురుకులాల్లో ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి గురించి ప్రభుత్వం స్పందించలేదు. మళ్లీ నిరుద్యోగులు రోడ్ల మీదికి వచ్చారు.
కాంగ్రెస్కు 12 సీట్లు కాదు 12-13 శాతం ఓట్లు వస్తే చాలా గ్రేట్. బీఆర్ఎస్-బీఎస్పీ కలవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతుంది. బహుజనులకు దీర్ఘకాలికంగా గొప్ప ప్రయోజనాలు అందే గొప్ప విప్లవాత్మకమైన పరిణామం ఈ పొత్తు. తెలంగాణ సంపదను దోచుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒక్కటే. ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ నీరుగారిపోయాయి. కేంద్రంలోని బీజేపీ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.