ప్రజాభిప్రాయానికి పాతర
మూసీ పునర్జీవం పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రజాభిప్రాయానికి పాతరేసింది. ప్రజా ఆకాంక్షలకు తూట్లు పొడుస్తున్నది. మూసీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో ప్రజాస్వామ్య విధానాలు, పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ రాష్ట్రస్థాయి నిపుణుల మూల్యాంకన కమిటీ(ఎస్ఈఏసీ) నిర్ణయాలు తీసుకోవడంపై పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశామంటూ నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాసంఘాలు, పర్యావరణ, సామాజిక కార్యకర్తలు, పౌరుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను బుట్టదాఖలు చేసి చోద్యం చూస్తున్నది.
సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : మూసీ ప్రక్షాళనకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ప్రత్యేక సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23, 2026న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సైంటిస్ట్ ఫర్ పీపుల్, మూసీ జన్ ఆందోళన్, సేవ్ మూసీ, తెలంగాణ జేఏసీ, హ్యూమన్ రైట్స్ ఫోరం, ఎన్విరాన్మెంట్ జస్టిస్ ఫోరం, పీపుల్స్ కమిటీ ఫర్ మూసీ రివర్ రిజువనేషన్తోపాటు వందలాది మంది నగరపౌరులు ఈమెయిల్స్, లిఖితపూర్వక వినతుల ద్వారా నివేదికలను అందించాయి. కానీ ఎస్ఈఏసీ మినిట్స్లో మాత్రం జూలై 15 వరకు తమకు 12 వినతులు మాత్రమే వచ్చాయని పేర్కొనడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. పలు వర్గాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులు ఏమైనట్లని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సైంటిఫిక్ నివేదికలు, అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని, తమ అభిప్రాయాలను బుట్ట దాఖలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మాటలతో బురిడి… అభిప్రాయాలకు గండి
ఎస్ఈఏసీ సమావేశంలో ప్రాజెక్టు ప్రతిపాదకులు ఇచ్చిన అభిప్రాయాలను సావధానంగా పట్టించుకున్న కాంగ్రెస్ పెద్దలు..సబ్ కమిటీకి ప్రజా సంఘాలు, పౌర సమాజం ఇచ్చిన అభిప్రాయాలకు గండికొట్టిందని స్పష్టం అవుతున్నది. కానీ ప్రజల అభ్యంతరాలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని, అందరి ఆమోదంతోనే ప్రాజెక్టును చేపడతామంటూ మాటలతో చివరకు బురిడీ కొట్టించింది. చివరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసినప్పుడు కూడా అందరీ సూచనలకు గౌరవం ఉంటుందని ఇచ్చిన హామీని కూడా మూసీ మురుగులో కలిపారంటూ మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన సబ్కమిటీనే, అభిప్రాయాలను బుట్టదాఖలు చేసినప్పుడు… ఇక ఆ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? జనాల దృష్టిని మళ్లించడానికి ఆడిన నాటకమా? అని పౌరులు ప్రశ్నిస్తున్నారు.
పర్యావరణ అమనుతులను తిరస్కరించాలి
మూసీ నది తీర ప్రాంతం, మౌలిక వనరులు, ప్రజా ధనంతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుపై సమగ్ర ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఇచ్చిన సిఫార్సులను తక్షణమే రద్దు చేయాలి. రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా ప్రాధికార సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు ఇచ్చిన పర్యావరణ అనమతులను కూడా తిరస్కరించాలి. ప్రజల నుంచి సేకరించిన వినతులు, అభిప్రాయాలను తక్షణమే పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. బహిరంగ విచారణ తర్వాతే ఈ ప్రక్రియలో ప్రభుత్వం ముందడుగు వేయాలి. ప్రజా అభిప్రాయాలను కాలరాసిన చర్యలను ఉపేక్షించేది లేదు.