హైదరాబాద్, జూన్ 6 (నమస్తేతెలంగాణ): ‘రాత్రింబవళ్లు శ్రమించి.. నిపుణులతో చర్చించి సాగు, తాగునీటిను అందించి.. 24 గంటల కరెంట్ సరఫరా చేసిన కేసీఆర్ విజనరీ లీడర్ అయితే.. రెండున్నరేండ్లుగా మొద్దునిద్ర పోయి ప్రాజెక్టులను పడావుబెట్టిన సీఎం రేవంత్ మిషనరీ లీడర్’అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ఒక్కో మీటింగ్కు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సభలు, సమావేశాల్లో సహచర మంత్రులను దెప్పిపొడుస్తున్నారని ఆరోపించారు. మొన్న గోసిపెట్టుకున్నవాడు రాజశేఖర్రెడ్డి కాడని పరోక్షంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే అవహేళన చేశారని, గతంలో యాదగిరిగుట్టలో ఆయనను కింద కూర్చొబెట్టి అవమానించారని గుర్తుచేశారు. సీఎం చేసిన అవమానాలకు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క కన్నీళ్లు పెట్టుకొంటున్నారని చెప్పారు. అధికార అహంకారం తలకెక్కిన సీఎం.. దళిత, బీసీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు.
గోసి కట్టుకొన్నవారు రాజశేఖర్రెడ్డి కాలేరని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్పీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. సెక్రటేరియట్ ఆరో అంతస్తులో కూర్చొన్నవారు కేసీఆర్ కాలేరని దెప్పిపొడిచారు. రేవంత్రెడ్డి ‘ఆప్కీ బార్ కాంగ్రెస్’ అంటుంటే ప్రజలు మాత్రం ‘బార్ బార్ కేసీఆర్ సర్కార్’ అంటున్నారని చెప్పా రు. రేవంత్ పాలనలో గంజాయి ఏరులైపారుతున్నదని ఆరోపించారు. మత్తులో హత్యలు, దారుణాలు జరుగుతుంటే హోంమంత్రి మాత్రం కేసీఆర్ను దూ షించడంలో బిజీగా ఉంటున్నారని ఎద్దే వా చేశారు. మోదీ, బాబు అండతో గ్రీకు లో ట్రాయ్ నగరాన్ని ధ్వంసంచేసిన చం దంగా రేవంత్రెడ్డి తెలంగాణ ను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలనపై దృష్టిపెట్టాలని చురకలంటించారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో పత్తాలేకుండా పోతారని హెచ్చరించారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వాపును చూసి బలుపు అనుకొని కేసీఆర్పై ఎగిరెగిరి పడుతున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన పాలనలో పాలమూరుకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టి రైతుల పొలాలను పడావుపెట్టారని మండిపడ్డారు. ఏరియల్ సర్వేచేస్తే సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని డిమాండ్చేశారు.