హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): దోషులను కాపాడటమే బీజేపీ సంస్కృతి అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో ఒక విధంగా, ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారంలో మరో విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పందించిన తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, బీఆర్ఎస్ను బదనాం చేయడం అజ్ఞానానికి నిదర్శనమని కొట్టిపారేశారు. మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదనడం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన మాటల్లా లేవని ఎద్దేవాచేశారు. ఆది నుంచి అతివలకు అండగా నిలుస్తున్న పార్టీ బీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. ఎంఐఎం ఎమ్మెల్సీతో రాజీనామా చేయించినట్టు రాంచందర్రావుకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్తో రాజీనామా చేయించాల్సిందని పేర్కొన్నారు.
బండి కేసులో మౌనమెందుకు?
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చినప్పుడు రామచందర్ రావు మౌనంగా ఎందుకున్నారని ప్రవీణ్కుమార్ నిలదీశారు. ఆ బాలికకు మద్దతుగా ఒక బీజేపీ మహిళా నాయకురాలు కూడా నిలబడలేదని ధ్వజమెత్తారు. బాలిక కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసిన బండిపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ మిలాఖత్ అయి కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. గుజరాత్లో బిలిస్ బానో కేసు, ఉన్నావ్లో బాలికపై జరిగిన లైంగిక దాడి అంశాలను ప్రస్తావించారు. నేరస్తులకు పూలదండలు వేసి సన్మానించడం ఆ పార్టీ కే చెల్లిందని గుర్తు చేశారు.
బాధితురాలికి న్యాయం చేయాలి
మీర్జా రహ్మత్ బేగ్ అంశంలో బాధితురాలికి న్యాయం చేసేలా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నించాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఒవైసీ తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అప్పగించాలని కోరారు. అవి ఫేక్, మార్ఫింగ్ వీడియోలు అంటూ రహ్మత్ బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరుగాలని పేర్కొన్నారు.